భూ అక్రమార్కులకు వణుకు మొదలైందా.? చికాకు పుట్టిస్తున్న సిట్!
బాలినేని తర్వాత ఎవరో?.. జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ
(అగ్ని ప్రతినిధి, అమరావతి). ప్రకాశం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు అలజడులు రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతా తానే అయి చక్రం తిప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు పార్టీలో ఇమడలేని పరిస్థితి వచ్చింది. మంత్రి పదవి పోవడం అటు తరువాత జోనల్ ఇన్చార్జి పదవి పోవడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడము, ఆ అధికారులు బాలినేని అనుచరులను అరెస్టు చేయడం మరో ఎత్తు. నిజానికి భూ ఆక్రమణలపై గత ఏడాది కాలంగా జనం గగ్గోలు పెడుతున్నారు. అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఇంకా చెప్పాలంటే మంత్రులు, మాజీ మంత్రులు కూడా సామాన్య ప్రజల భూములను కబ్జా చేసుకుంటూ వాటిని తమ ఆదీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు చేస్తున్న భూ దోపిడిని అడ్డుకునే పరిస్థితి దాదాపు కనుచూపు మేర లో కనిపించలేదు. ఇక ఎన్నికలు దగ్గరకు వచ్చే కొద్దీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిద్దుబాటు చర్యలకు నడుం బిగించారు. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందనే విషయంపై ఐపాక్ తో సర్వే నిర్వహించారు. ఆ సర్వేల్లో మింగుడు పడని అంశాలు అనేకం జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చాయి. వాటిల్లో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు భూ ఆక్రమణలకు తెగబడ్డారని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని ఐప్యాక్ రిపోర్ట్ ఇచ్చింది. పాత 13 జిల్లాల వారీగా చూస్తే,అత్యంత ఎక్కువగా ప్రకాశం జిల్లాలో భూ దందా కొనసాగిందని ఆ రిపోర్ట్ లో ఉంది. ఒంగోలు కేంద్రంగా దాదాపు 127 ఫైల్స్ అక్రమంగా, తప్పుడు స్టాంపులతో భూదంధా చేశారని, ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. వీటిని పట్టించుకోకుండా ఎన్నికలకు పోతే జనం కీలెరిగి వాత పెడతారంటూ ఐ ప్యాక్ హెచ్చరించింది. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వారి అనుయాయులు ఇష్టారీతిగా భూ దందా చేశారంటూ స్పష్టం చేసింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో.., అసలు యజమానులు ఉన్నా.., పట్టించుకోకుండా తప్పుడు రికార్డులు క్రియేట్ చేసి వేల ఎకరాలు దోచేసుకున్న వైనం బయటకు వచ్చింది. సీఎం జగన్ ముందుగా ఒంగోలులో సీట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేశారు. ఈ బృందం విచారణ మొదలుపెట్టగానే ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి బాలినేనిని టార్గెట్ చేసుకుంటూ ప్రకటనలు ఇచ్చారు. దీనిపై బాలినేని కూడా విచారించండి.., అరెస్టులు చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఇక జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సిట్ బృందానికి చైర్మన్ గా ఉంటూ తన పని తాను చేయడం మొదలుపెట్టారు. అంతే ఏడు మంది బాలినేని అనుచరులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించారు. దీనిపై బాలినేని భగ్గుమన్నారు. అసలు నిజాలు కనుక్కోకుండా మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా అలిగి తన గన్ మెన్ లను వెనక్కు పంపించారు. ఆ తర్వాత సీఎంను కలిసేందుకు ప్రయత్నించడం, అది నెరవేరకపోగా స్పెషల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డితో మీట్ అవడం, ఎస్పీని బదిలీ చేయాలంటూ ఆయనకు చెప్పడం, చకచకా జరిగిపోయాయి. అయితే సీఎం జగన్ భూ దందాపై ఉక్కు పాదం మోపాలనే కృత నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది.అందుకే ఎస్పీ మలిక గార్గ్ ను బదిలీ చేసే అవకాశం లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం గమనార్హం. ఎందుకంటే అసలైన యజమానులకు న్యాయం చేయకపోతే ఓట్లు రాలవు, ప్రభుత్వం రాదనే విషయం జగన్ కు బాగా అర్థమైపోయింది. అందుకే సీట్ కు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు. బాలిలేని చెప్పినా ససేమీరా అన్నారు. ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ కూడా బాలినేని కనుసన్నల్లోనే పనిచేస్తూ నాన్ బెయిలబుల్ కేసులకు బదులు బేయిలబుల్ కేసులు నమోదు చేసి మమ అనిపించారు. అయితే జిల్లా జడ్జి దీనిపై సీరియస్ కావడంతో తాజాగా ఎస్పీ గార్గ్ ,మరో నలుగురిని అరెస్టు చేసినట్లు విశ్వసనీయపర్గాల సమాచారం. ఇదంతా జరుగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా భూ అక్రమార్కులు బయటికి నిబ్బరంగా కనిపిస్తున్నారు. ఇక యజమానుల్లో మాత్రం కాస్త విశ్వాసం నెలకొని ఉంది. ప్రభుత్వం బాలినేని శ్రీనివాసరెడ్డి నే పట్టించుకోకపోతే, ఇక సాధారణ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయా ఎమ్మెల్యేల వెనుక ఉండి,భూ దందాకు నాయకత్వం వహించిన చోటామోటా నాయకుల గతి ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు వారి అనుయాయులు చేసిన భూ ఆక్రమణలు, దాని పర్యవసానం, సిట్ ఏర్పడ్డాక జరుగుతున్న పరిణామాలు, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ నిజాయితీగా నిఖార్సుగా ఉండి సిట్ ఫలితాలు సక్రమంగా బయటకు వచ్చేలా కృషి చేస్తారా లేదా అనేది చూడాలి.!
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.