ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న జగన్ సర్కార్
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఈనెలలో చేపట్టే సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపైనా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. సుమారు 50 అంశాలపై కేబినెట్ లో చర్చ జరగనుంది. ప్రధానంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్ట్ ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటును పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మరో రూ.19,037 కోట్ల విలువైన 10 పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో ఏడు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగా.. మూడు విస్తరణ కార్యక్రమాలకు చెందినవి ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 69,565 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వివిధ రంగాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో పాటు ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమల విస్తరణకు ఆమోదం తెలపనుంది కేబినెట్.
*పంటరుణాలతో పాటు..*
నవంబర్ లో అమలుచేసే సంక్షేమ పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలతో పాటు ఇతర పథకాల అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ఏ నెలలో ఏయే పథకాలు అమలుచేయాలనే దానిపై సంక్షేమ కేలండర్ విడుదల చేసింది. ఈ కేలండర్ ప్రకారం పథకాలు అమలుచేస్తోంది.
*ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు..*
ఈ నెలలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన యూనివర్శిటీ అధ్యాపకుల పోస్టుల భర్తీతో పాటు గ్రూప్ – 1, గ్రూప్ – 2, ఇతర పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
*ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి..*
వీటిల్లో 900 వరకు గ్రూప్–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్–1 పోస్టులున్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేస్తారు. ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి డిసెంబర్లో సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా కేబినెట్ లో చర్చించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో కరువు మండలాలను ప్రకటించింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల్లో సాగునీటి ఇబ్బందులు, ప్రత్యామ్నాయ పంటలపైనా కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు దేవాదాయ శాఖలోని పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. వీటితో పాటు పలు సంస్థలకు భూకేటాయింపులకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.