ఆ అవకాశాలు ఎవరికి దక్కేనో ?
- పెరుగుతున్న ఆశావహులు
అమరావతి: ఐదేళ్ల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం కూడా ఇప్పుడు నేతలు, కార్యకర్తలతో సందడిగా మారింది. వాస్తవానికి పార్టీ ఓడిన తర్వాత దాదాపు ఏడాదిన్నర పాటు చాలామంది నేతలు కార్యాలయం వైపు రావడానికి కూడా భయపడ్డారు. జగన్ సర్కార్ కక్ష సాధింపుతో వ్యవహరించడంతో పాటు అక్రమ కేసులు, దాడులకు తెగబడటంతో బయటకి వచ్చేందుకు కూడా ధైర్యం చేయలేదు. అయితే ఒంగోలు మహానాడు తర్వాత నేతలంతా వైసీపీ సర్కార్కు ఎదురు తిరిగారు. నిత్యం ప్రజల్లోనే గడిపారు. పార్టీ గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ఇప్పుడు ఓడితే... మనకు భవిష్యత్తు లేదు అన్నట్లుగా కష్టపడ్డారు. అనుకున్నది సాధించారు.
పార్టీ కోసం కష్టపడిన నేతలంతా ఇప్పుడు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత... పదవులు వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు. కొందరు నామినేటెడ్ పదవుల కోసం... మరి కొందరు పార్టీ పదవుల కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు కూడా. ఇందుకోసం కొందరు నేతలు పైరవీలు కూడా చేయిస్తున్నారు. గతంలో పార్టీ పదవులు అనుభవించిన వారేమో నామినేటెడ్ పదవుల కోసం... అధికారం అనుభవించిన వారేమో... పార్టీ పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత హోమ్ మంత్రి అయ్యారు. దీంతో ఆ పదవి కోసం మహిళా నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీకి కేటాయించడంతో... అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు పీతల సుజాత, పనబాక లక్ష్మీతో పాటు ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మ కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో గ్రీష్మ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ తరఫున ప్రచారం చేయడంతో... ఆ పేరును పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఎస్సీ సెల్ అధ్యక్ష పదవి కోసం కూడా జాబితా పెద్దగానే ఉంది. రైతు సంఘం నేతగా శ్రీనివాసులు రెడ్డినే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. బీసీ సెల్ నేతగా కొల్లు రవీంద్ర స్థానంలో చోటు ఎవరికి వస్తుందనే చర్చ ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోయే సీనియర్ నేతకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఇక కొత్త అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మిగిలిన పార్టీ పదవులపై ఆయన కసరత్తు చేస్తున్నారు.
ఇక ఇప్పటి వరకు పార్టీ పదవుల్లో ఉన్న నేతలు... ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తాయని భావిస్తున్నారు. జాతీయ అధికార ప్రతినిధులు పట్టాభి, జీవీ రెడ్డి, తిరునగరి జ్యోత్న్స, డ్వాక్రా, అంగన్వాడీ సాధికార కమిటి అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళ రాష్ట్ర నేతలు మజ్జి పద్మావతితో పాటు పలువురు పార్టీ నేతలు ఇప్పుడు పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ మహిళా కార్పొరేషన్ ఛైర్మన్, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్, పర్యాటక శాఖ కార్పొరేషన్, ఏపీఐఐసీ ఛైర్మన్, సోషల్ వెల్ఫేర్ బోర్డు, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవుల కోసం నేతలు ప్రయత్నం చేస్తున్నారు. నేతల పనితీరుపై ఇప్పటికే అంతర్గత సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖలు, కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పోస్టు వివరాలు ఈ నెల 8 లోపు ఇవ్వాలని అన్ని శాఖలను జీఏడీ ఆదేశించింది. మరి అధినేత చల్లని చూపు ఎవరి మీద ఉందో తెలియాలంటే... మరో వారం రోజులు ఆగాల్సిందే.
చివరిగా ఒక్క మాట... వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, నామినేటెడ్ పదవుల పంపకంలో చూపించినంత ఉత్సాహం, టీడీపీ లో లేదని క్రియాశీలక టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు.చివరివరకు నాన్చకుండా పదవుల పంపకంలో ఆసక్తి చూపించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.ఇది గమనించదగిన వాస్తవం...!
About The Author

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.